సాగర్ కుడి కాల్వను ఏపీ ఆపరేట్ చేసుకుంటదట.. మీ అభిప్రాయం చెప్పండి..తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

సాగర్ కుడి కాల్వను ఏపీ ఆపరేట్ చేసుకుంటదట.. మీ అభిప్రాయం చెప్పండి..తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్టు​కుడి కాల్వను ఆపరేట్ చేసేందుకు అనుమతివ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణకు కృష్ణా బోర్డు సూచించింది. సాగర్​నుంచి మరో 73.50 టీఎంసీల నీళ్లివ్వాలన్న అంశంపైనా స్పందన తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఈఎన్​సీ జనరల్​కు లేఖ రాసింది. గత నెలలో సాగర్​కుడి కాల్వను ఆపరేట్​చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసింది.

ఈ కాల్వ పవర్​హౌస్​ద్వారా 535 అడుగుల వరకే నీళ్లను తీసుకోవడానికి వీలవుతుందని, ఆ తర్వాత తీసుకోలేమని తెలిపింది. ఇప్పటికే సాగర్ ఆయకట్టు కింద పంటలు, తాగునీటి అవసరాలు ఉన్నాయి కాబట్టి కుడి కాల్వహెడ్​రెగ్యులేటర్​ను తాము ఆపరేట్ చేసుకునేలా సీఆర్​పీఎఫ్​కు ఆదేశాలివ్వాలని కోరింది. అంతేకాకుండా, కృష్ణాలో నీటి వినియోగంపైనా ఏపీ ఇటీవల లేఖ రాసింది.

వరద రోజుల్లో వాడిన నీటిని కాకుండా.. వరద రోజుల తర్వాత వాడుకున్న 465 టీఎంసీలనే లెక్కలోకి తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు సాగర్​నుంచి నీళ్లివ్వాలని డిమాండ్​పెట్టింది. ఈ క్రమంలోనే ఆయా అంశాలపై తెలంగాణ అభిప్రాయాలు చెప్పాలని బోర్డు చైర్మన్​లేఖ రాశారు.